వైయస్సార్ కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో గత కొద్ది రోజుల నుంచి తీవ్ర కలహాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్వం ఈ మఠానికి అధిపతిగా వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే ఈ మఠాధిపతి తాజాగా కరోనా రావడంతో నిష్క్రమించారు. అయితే వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మొదటిభార్య మరణించిగా రెండవ పెళ్లి చేసుకున్నారు. ఈ భార్యకు ఇద్దరు కుమారులు.

ప్రస్తుతం వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి నిష్క్రమించడంతో మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండవ భార్య పెద్ద కుమారుడు గోవింద స్వామి ( 9) మధ్య వివాదం నెలకొంది. ఈ మఠానికి అధిపతిగా కొనసాగాలని వెంకటాద్రి తెలుపగా, రెండవభార్య గోవింద స్వామిని నియమించాలని వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే గోవిందస్వామి మైనర్ కావడంతో అతడు మేజర్ అయ్యేవరకు బాధ్యతలను స్వీకరిస్తానని రెండవ భార్య మహాలక్ష్మమ్మ పోటీకి వచ్చారు.
ఈ విధంగా వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఏర్పడిన ఈ కుటుంబ కలహాలకు పరిష్కారం తెలపడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మఠాల నుంచి 7గురు పీఠాధిపతులు బుధవారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న పీఠాధిపతులు మఠంలో రెండు రోజుల పాటు ఉండి ఈ మఠం సిద్ధాంతాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మఠాధిపతి నియామకం గురించి తెలియజేస్తామని తెలిపారు.
వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి తన రెండో భార్యకు రాసిచ్చిన వీలునామాలో ఏముందనే విషయాన్ని కూడా తాము పరిశీలించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, అదేవిధంగా పీఠాధిపతులు మఠాధిపతులు ఎంపిక విషయంలో దేవాదాయ శాఖ పాత్ర ఎంత వరకు ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తామని శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి తెలిపారు.
































