మన దేశంలో కరోనా నానాటికీ పెరుగుతూనే ఉంది.. కోవిడ్-19 ప్రభావాన్ని సకాలంలో గుర్తించి లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే అనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా సగటున లక్ష మందికి 254 కరోనా టెస్టులు మాత్రమే చేస్తుండటం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం. కరోనా టెస్టులు చేయడం ఇంకాస్త స్పీడు పెంచితే పాజిటివ్ కేసులు సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే పరిణామం.

కాగా సోమవారం (20 ఏప్రిల్) ఉదయానికి కరోనా సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 17 వేలు దాటింది. దేశంలో మొత్తం మీద 17,265 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అందులో 543 మంది ఇప్పటివరకు మృతి చెందగా.. మరో 2546 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య మాత్రం 14,175 గా నమోదయింది.

రాష్ట్రాలవారీగా చుస్తే… అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ 2003 కేసులు, గుజరాత్ 1743 కేసులు, రాజస్థాన్ 1478 కేసులు, తమిళనాడు 1477 కేసులు, మధ్యప్రదేశ్ 1084 కేసులు, తెలంగాణాలో 844 కేసులు, ఆంద్రప్రదేశ్ లో 646 కేసులు నమోదయ్యాయి.































