తెలంగాణలో భారీ మొత్తంలో కేసులు బయటపడుతున్నాయి.. ఒక్కసారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒకరు షాద్ నగర్ లో.. మరొకరు సికింద్రాబాద్ లో మరణాలు నమోదయ్యాయి. అయితే ఈరోజు 15మంది డిశ్చార్జి అయ్యారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రభుత్వం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం… రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229 కి చేరింది. దీనితో చనిపోయిన వారి సంఖ్య 11కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారు మొత్తం 32 మంది బయటపడ్డారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 186 ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు మరియు వారితో సన్నిహితంగా ఉన్న వారికి పరీక్షలు చేయడం వల్లనే ఈ సంఖ్య అమాంతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ఆరు ల్యాబ్ ల్లో 24 గంటల్లో మూడు షిఫ్ట్ ల్లో యుద్ధప్రాతిపదికన కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.
































