రైతులు పండించిన పంటలను కొందరు రైతులు వెంటనే మార్కెట్లో విక్రయిస్తుంటారు. దీంతో వచ్చిన డబ్బులను పెట్టుబడి పెడుతూ మరో పంటను సాగు చేస్తుంటారు. కానీ కొంత మంది పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే వాటిని కోల్డ్ స్టోరేజ్ లల్లో దాచుకుంటారు. అయితే ఒక్కోసారి రైతులు పండించిన పంటకు ఎక్కడా లేని ధర పలుకుతుంది.

అలాంటిదే అక్కడ తెల్లబంగారం (పత్తి) పండించిన రైతులకు నిజంగానే బంగారం కురిపించినట్లు అయింది. వాటి ధరలు మాత్రం ఏకంగా ఆకాశాన్ని తాకాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్లో పెరిగాయి. మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా 8వేల 80రూపాయలు పలికింది. డివిజన్లోని ఏరిగేరి గ్రామానికి చెందిన రైతు కిష్టప్ప.. తాను పండించిన పత్తిని ఆదోని వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చారు.
ఆ రైతుకు చెందిన పత్తి గరిష్టంగా క్వింటారూ. 8వేల 80రూపాయలకు వ్యాపారి కొనుగోలు చేసినట్లు యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రికార్డ్ స్థాయి ధరలు ఖరీఫ్ సాగుకు ముందు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారుల మధ్య పోటీ కారణంగానే ఇలా రోజు రోజుకూ ధరలు పెరుగుతున్నాట్లు చెబుతన్నారు.
రైతుల వద్ద కొత్త దిగుబడుల నిల్వలు లేకపోవడం పరిశ్రమలకు అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెరగడానికి కారణమైంది. నేటి వరకు పంటను దాచుకున్న రైతులు ధరలు పెరగడంతో మార్కెట్ కు తీసుకొస్తున్నారు.



























