ప్రస్తుతం మన అందరి పరిస్థితి కరోనాకి ముందు కరోనా తరువాత అన్నట్టుగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ క్రమంలోనే ఈ వైరస్ వివిధ వేరియంట్ ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్ నుంచి ఇండియా కోల్పోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులకు డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ రెండవదశ రూపంలో వ్యాప్తి చెంది ప్రజలందరి జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేసింది.అయితే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించి ఈ మహమ్మారిని అరికట్టడంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కేసులు తగ్గాయి అనుకుంటున్న క్రమంలోనే డెల్టా వేరియంట్ సరికొత్త రూపం దాల్చి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో దేశంలో చాపకింద నీరులాగా పాకిపోతోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాగా, మరణాలు కూడా సంభవించాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ ఈ వైరస్ వేరియంట్లను మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతుంది. తాజాగా ఇండియాలో కొత్తగా 44,111 పాజిటివ్ కేసులు రాగా… మొత్తం కేసుల సంఖ్య 3,05,02,362కి చేరింది. దేశంలో కొత్తగా 738 మంది మరణించారు.మొత్తం మరణాల సంఖ్య 4,01,050కి చేరింది. మరణాల రేటు ఇండియాలో 1.3 శాతం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.






























