ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ (మధుమేహం)
వ్యాధి ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈవ్యాధిని మొదట్లోనే గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేయవచ్చు.డయాబెటిస్ ప్రధానంగా రెండు రకాలు టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్
వీటిలో సాధారణంగా టైప్-1డయాబెటిస్ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. ఇలాంటి వారు చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

డయాబెటిస్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.కొంత మందిలో షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నా వాటిని గుర్తించడం కష్టం. షుగర్ వ్యాధికి మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిలను అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడమే.అంటే శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది.
షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవిత కాలం పాటు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.తాజా అధ్యయనం ప్రకారం టైప్1 మధుమేహ వ్యాధి ముప్పు పొంచి ఉన్నవారికి టెప్లిజుమాబ్ మందు తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఇలాంటివారికి టెప్లిజుమాబ్ ఉపయోగపడుతున్నట్టు, జబ్బు బయటపడటం రెండున్నరేళ్లు ఆలస్యమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఇలాంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవ్వటం గమనార్హం.ఒక కోర్సు మందుతోనే దీర్ఘకాలం పాటు ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక టెప్లిజుమాబ్ అనుమతి లభిస్తే టైప్1 డయాబెటిస్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే తొలి మందు ఇదే కావడం విశేషం.































