వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చాలామంది నమ్మకం. విటమిన్ సి, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండిన నేరేడు పండు శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే, అందరికీ ఇది సమానంగా ఉపయోగపడదన్న విషయం వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారు లేదా ఇటీవల సర్జరీ చేయించుకున్నవారు నేరేడు పండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. ఆపరేషన్ ముందు, తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండటం అవసరం. అలాంటి సమయంలో నేరేడు పండ్లు తీసుకుంటే చక్కెర ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గర్భిణీలు కూడా ఈ పండును తీసుకునేటప్పుడు మితిమీరకుండా జాగ్రత్తపడాలి. నేరేడు పండులోని కొన్ని పదార్థాలు శరీరంలో కాల్షియం శోషణను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో వేడి పెరగడానికి కారణమవుతుందని ఆయుర్వేదంలో పేర్కొంటారు. అందువల్ల గర్భధారణ సమయంలో వైద్యుల సూచనతో మాత్రమే పరిమితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఇంకా, ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తినడం కూడా సమస్యలకు దారితీయవచ్చు. ఈ పండులో ఉండే ఆమ్ల గుణాల వల్ల కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. అలాగే నేరేడు తిన్న వెంటనే పాలు తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు కలిసి జీర్ణక్రియలో అంతరాయం కలిగించి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే అవకాశం ఉంది.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా ఆస్తమా లేదా తరచూ దగ్గు, జలుబుతో బాధపడేవారు కూడా ఈ పండును జాగ్రత్తగా తీసుకోవాలి. నేరేడు పండుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంతో కఫం పెరగవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దీనిలో ఉన్న అధిక పొటాషియం కారణంగా వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
అయితే నేరేడు పండును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో, పరిమితంగా తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు. భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత ఈ పండును తీసుకోవడం ఉత్తమం. కొద్దిగా ఉప్పు లేదా వాము పొడి కలిపి తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.






























