సాధారణంగా మనలో చాలామంది మన ఇంటిలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా చాలా మంది ఎక్కువగా పెంపుడు జంతువులుగా కుక్కలని పెంచుకోవడం చూస్తుంటాము. ఈ విధంగా వారు ఎంతో ఇష్టంగా పెంచుకొనే పెంపుడు కుక్కల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని ఒక జంతువు మాదిరి కాకుండా సొంత కుటుంబంలోని సభ్యులుగా భావించి వాటి ఆలనాపాలన చూసుకుంటూ ఉంటారు.

ఈ విధంగా పెంపుడు జంతువుల పట్ల మనం ఎంత అభిమానం చూపిస్తామో అవి కూడా మన పట్ల అంతే విశ్వాసం చూపిస్తాయి.ఈ విధమైన విశ్వాసం చూపుతూ తమ కుటుంబ సభ్యులను ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడేసిన సంఘటనలను గురించి మనం చాలానే విన్నాం. అచ్చం అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది.
సాధారణంగా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కొద్దిరోజుల పాటు వారి గురించి బాధపడి తర్వాత ఎవరి పనులలో వారు నిమగ్నమవుతారు. కానీ ఒక శునకం మాత్రం తన యజమాని పట్ల చూపించిన విశ్వాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను ఎంతో అపురూపంగా చూసుకునే యజమాని చనిపోవడం వల్ల ఆ శునకం బాధ వర్ణనాతీతంగా మారింది.
కేరళ మలప్పురంలో నివసించే యజమానురాలు చనిపోవడంతో ఆమె ఎంతో ఇష్టంగా చూసుకున్న శునకం నిత్యం ఆమె ఫోటో ముందు నిలబడి విలపిస్తోంది. తన యజమానురాలు మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆమెను తలుచుకొని ప్రతి రోజు తన ఫోటో ముందు నిలబడి ఫోటోను చూస్తూ అరుస్తూ ఉంది. ఈ విధంగా ఒక శునకం తన యజమాని పట్ల చూపించే ప్రేమకు, విశ్వాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































