Editor Gowtham Raju : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు(68) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈయన మంగళవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరువాత అర్ధరాత్రి ఆరోగ్యం క్షీనించడం తో తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ ఎడిటర్ గా పేరు సంపాదించుకున్న ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేసారు.

చట్టానికి కళ్లు లేవు సినిమాతో మొదలు పెట్టి…
గౌతమ్ రాజు ఇప్పటివరకూ దాదాపు 800 పైగా సినిమాలకు ఎడిటర్ గా చేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషా చిత్రాలకు కూడా ఈయన పని చేశారు. చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టి తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఈయన గబ్బర్ సింగ్, రేసు గుర్రం, అదుర్స్, గోపాల గోపాల, ఖైదీ 150, బలుపు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్న చాలా తక్కువ మందిలో ఈయన ఒకరు. ఆది సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని మోతినగర్ లోని తన నివాసానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.































