ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంటే మరి కొన్ని దేశాల్లో మాత్రం సంవత్సరం సంవత్సరానికి తగ్గుతోంది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతూ యువత తక్కువ సంఖ్యలో ఉండటం ఆయా దేశాల ప్రభుత్వాలను భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో సింగపూర్ ప్రభుత్వం పిల్లలను కనేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. పిల్లలను కనకుండా వాయిదా వేసుకుంటున్న వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పిల్లలను కనేవారి కోసం ఏకంగా 3 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,50,000 రూపాయలు) ఇస్తామని ప్రకటించింది. సాధారణంగా సింగపూర్ జనాభా చాలా తక్కువ. గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వం ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది. అయితే ఆఫర్లు ప్రకటిస్తున్నా గత కొన్నేళ్లుగా సింగపూర్ లో జననాల రేటు తక్కువగా నమోదవుతోంది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల పిల్లలను కనాలనుకునే జంటలు ఆ నిర్ణయాలను వాయిదా వేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వాళ్లు పిల్లలను కనాలకుకోవడంపై పునరాలోచించేలా చేస్తున్నాయి. దీంతో బేబీ బోనస్ క్యాష్ గిఫ్ట్ పేరుతో సింగపూర్ ప్రభుత్వం గతంలో స్కీమ్ ను ఇచ్చింది. ఈ స్కీమ్ ద్వారా లక్షల రూపాయలు అక్కడి వివాహిత జంటలకు ఇస్తోంది. కరోనా వల్ల జననాల రేటు మరింత దిగజారే అవకాశం ఉందని భావించి “ది బేబీ సపోర్ట్ గ్రాంట్” పేరుతో మరో స్కీమ్ ను వివాహిత జంటలకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త స్కీమ్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ నెల వరకు అమలులో ఉండనుంది. సింగపూర్ లో పిల్లలను కనే వివాహిత జంటలకు ఏకంగా 13,000 సింగపూర్ డాలర్లు సొంతం కానున్నాయి. అయితే ఈ దేశాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే మరికొన్ని దేశాల్లో జనాభాను తగ్గించే దిశగా చర్యలు చేపడుతుండటం గమనార్హం.





























