శుక్రవారం రాత్రి హైదరాబాదులోని మాధాపూర్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదట ప్రమాదానికి గురైన సమయంలో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అతడిని స్థానికులు మొదట గుర్తుపట్టలేదు. తర్వాత వెంటనే సాయి ధరమ్ తేజ్ గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడ నుంచి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మేనల్లుడు రోడ్డుప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో చిరంజీవి, పవన్ కల్యాణ్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు.
అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి తరలివచ్చారు. వాళ్లతో పాటు నిహారిక, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్టవ్ తేజ్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదానికి అసలు కారణం రోడ్డుపై ఉన్న ఇసుక అని తేలింది. అతడు బైక్ పై వస్తున్న క్రమంలో ఒక్క సారిగా బైక్ ముందు టైర్ అక్కడకు రాగానే స్కిడ్ అయింది. అతడు హెల్మెట్ పెట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. దాని వలన ఆయన తక్కువ గాయాలతో బయటపడగలిగారని అంటున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీల్లో వీడియో రికార్డు అయింది.






























