గత కొద్ది రోజుల నుంచి కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మశాన వాటికలలో అంత్యక్రియలు నిర్వహించడానికి కుదరని నేపథ్యంలో కొందరు శవాలను గంగానదిలో వేయడంతో శవాలు నది ఒడ్డుకు కొట్టుకు రావడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరాఖండ్ లోని ఫితోరాఘడ్ సరయు నది ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫితోరాఘడ్ సరయు నదిలో గుర్తు తెలియని శవం ఒకటి కొట్టుకు వచ్చింది. అయితే ఈ శవం సగం కాలిపోయి ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ శవం ఆ పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ వద్ద కనిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గత కొద్దిరోజుల నుంచి గంగానదిలో కూడా ఈ విధంగా శవాలు కొట్టుకు రావడంతో ఆ శవాలన్ని కరోనా బాధితులవని తెలిపారు. ఈ క్రమంలోనే సరియు నది ప్రాంతంలో కొట్టుకొచ్చిన శవం కూడా కోవిడ్ బాధితుడిదనే ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే అది కోవిడ్ తో మరణించిన శవమా లేదా అనే విషయం నిర్ధారణ కావలసి ఉంది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటనపై స్పందించిన అధికారులు అది కరోనాతో మృతిచెందిన వ్యక్తి శవమా? కాదా? అనే విషయం నిర్ధారణ కాలేదు. కనుక ఎవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా త్రాగు నీటిలో శవాలు కొట్టుకు రావడంతో ఇవి నీటిని కలుషితం చేసి మరిన్ని అనారోగ్య సమస్యలను కలిగిస్తాయని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.































