ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన పెన్సిల్ లిడ్పై హనుమంతుడి రూపాన్ని అత్యంత సూక్ష్మంగా చెక్కి భక్తి, కళను ఒకే చోట కలిపారు.

కేవలం 12 మిల్లీమీటర్లు పొడవు, 8 మిల్లీమీటర్లు వెడల్పు ఉన్న పెన్సిల్ లిడ్పై ఈ కళాఖండాన్ని ఆయన ప్రత్యేక పరికరాలు లేకుండానే సుమారు రెండు గంటల్లో పూర్తి చేశారు. ఈ సూక్ష్మ శిల్పంలో హనుమంతుడి ఆకృతి స్పష్టంగా కనిపించడం చూసి కళాభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సూక్ష్మ కళారూపాలు ఎంత చిన్నవిగా ఉన్నా వాటిలో అపారమైన నైపుణ్యం, సహనం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం కళాఖండం దెబ్బతినే అవకాశం ఉండటంతో, ఇలాంటి కళలు అత్యంత క్లిష్టమైనవిగా భావిస్తారు.
ఇప్పటికే అనేక రికార్డులు సాధించిన విజయ మోహన్, తన కొత్త కళాఖండంతో మరోసారి స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. భక్తి భావాన్ని కళ రూపంలో చూపించిన ఈ ప్రయత్నం యువ కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది.



























