తెలుగు అకాడమీ అంటే ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఎన్నో పుస్తకాలను విద్యార్థులకు అందించింది. హిమాయత్ నగర్ లో ఉంటే ఈ అకాడమీలో పెద్ద గోల్ మాల్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అకాడమీకి సంబంధించి ఫిక్స్ డ్ డిపాజిట్ లలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఈ విషయం కాస్త అధికారులకు తెలవడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దీని కోసం త్రీ సభ్య కమిటీని కూడా నియమించారు. తెలుగు అకాడమీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిచి.. నిధుల గోల్ మాల్ పై ఆరాతీశారు. విచారణ కమిటీ హెడ్ గా ఉన్న ఐఏఎస్ ఉమర్ జలీల్ ఆధ్వర్యంలో ప్రతి రికార్డును అధికారులు పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా బ్యాంక్ ప్రతినిధులను కూడా సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తెలుగు అకాడమీకి దాదాపు 34 బ్యాంకుల్లో అకౌంట్ ఉంది. రెండు బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా లేవు. ఫోర్జరీ సంతకాలు వాడి.. అందులోని డబ్బులను కాజేశారు.
అంతే కాకుండా ఆ అకౌంట్లను క్లోజ్ కూడా చేసేశారు. కార్వాన్ మరియు సంతోష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లో ఫ్రాడ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక బ్రాంచ్ నుంచి రూ.43 కోట్లు.. మరో బ్రాంచ్ నుంచి రూ.8 కోట్లు.. మొత్తం రూ.51 కోట్ల నిధులు కొట్టేశారు. దీనిపై బ్యాంక్ డీజీఎం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో.. ఈనెల 24న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.
ఇప్పుడు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. ఈ విచరణలోనే మరి కొన్ని విషయాలు బయట పడ్డాయి. దీనిపై ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. సుమారు 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు అకాడమీ అధికారులు సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.































