Dill Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్లో ఫేక్ వ్యూస్ ట్రెండ్కు స్వస్తి పలుకుతూ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు సినిమాల ప్రమోషన్ కోసం యూట్యూబ్లో డబ్బులిచ్చి వ్యూస్ కొనే పద్ధతిని ఇకపై ఆపేస్తున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. నిజాయితీ లేని ప్రమోషన్స్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన, తన బ్యానర్లో తెరకెక్కే సినిమాలకు ఇకపై ఫేక్ వ్యూస్ కొనబోమని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా వస్తున్న “తమ్ముడు” సినిమాతోనే ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు దిల్ రాజు తెలిపారు.

దిల్ రాజు మాటల్లోనే అసలు విషయం:
“మనం పెట్టిన ట్రైలర్ లేదా పాట నిజంగా ఎంతమందికి చేరుతుందో తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. లక్షలు, కోట్లు పెట్టి వ్యూస్ కొంటే.. ఆ నెంబర్ చూసి మనం సంతోషపడొచ్చు. కానీ, అది నిజమైన ఆదరణ కాదు కదా! మన కంటెంట్ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయిందో మనకు అర్థం కాదు. అందుకే, మా పీఆర్ టీమ్కు చెప్పాను.. ఇకపై మన సినిమాలకు వ్యూస్ కొనొద్దు అని. ‘తమ్ముడు’ సినిమాతో ఈ కొత్త పద్ధతిని మొదలుపెడుతున్నాం,” అని దిల్ రాజు అన్నారు.
కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు:
“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాను ఉదాహరణగా చూపిస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని దిల్ రాజు నమ్మకంగా చెప్పారు. “సినిమాలో విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు. మన కంటెంట్ ఎంత రీచ్ అవుతుందో తెలిస్తేనే కదా.. ఎక్కడ లోపం ఉందో తెలుస్తుంది. అప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది,” అని ఆయన అన్నారు.
మీడియా కూడా ప్రశ్నించాలి:
ఇలాంటి ఫేక్ వ్యూస్ వ్యవహారాలపై మీడియా కూడా దృష్టి పెట్టాలని, బాధ్యులైన వారిని నిలదీయాలని దిల్ రాజు సూచించారు. “మీడియా మిత్రులు ఇలాంటి విషయాలపై ఎందుకు ప్రశ్నించరో నాకు అర్థం కాదు. ఫాల్స్ ప్రమోషన్లను ఆపడానికి ప్రయత్నిస్తేనే ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే అందరూ కలిసికట్టుగా మంచి కంటెంట్ను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రకటనతో దిల్ రాజు టాలీవుడ్లో ఒక కొత్త చర్చకు తెరలేపారు. మరి మిగతా నిర్మాతలు కూడా ఈ విషయంలో దిల్ రాజు బాటలో నడుస్తారో లేదో చూడాలి.






























