కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కలిసి విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఇన్స్పైర్– మనక్ పేరుతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నాయి. బాల్యంలోనే విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించాలని.. విద్యార్థులలోని వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలని ఈ సంస్థలు కృషి చేస్తున్నాయి. 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు ఆన్ లైన్ లో పోటీలో పాల్గొనవచ్చు.

ప్రతి సంవత్సరం ఈ పోటీలు ఎంతో సందడిగా జరిగేవి. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో ఈ సంవత్సరం మార్చి నెలలో పోటీలు జరగాల్సి ఉండగా లాక్ డౌన్ వల్ల ఈ పోటీలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గతేడాది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చు.
ఇప్పటికే విద్యాశాఖ నుంచి డీఈవోలకు డిసెంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు పోటీలు జరిపేలా ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థులు తమ ప్రదర్శనలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి నుంచి అప్ లోడ్ అయిన ప్రాజెక్ట్ లలో 10 శాతం ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతాయి. విద్యాశాఖ ఈ నెలాఖరులో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తుంది.
http://www.inspireawards-dst.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లాక్ డౌన్ కు ముందే ఈ పోటీలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా ఎంపికైన విద్యార్ధుల ప్రాజెక్టుల తయారీకి 10,000 రూపాయల సాయం అందుతుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కలిసి ఈ పోటీలను నిర్వహిస్తాయి.































