టాలీవుడ్లో కలెక్షన్ కింగ్గా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు మంచు మోహన్ బాబు. గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణ రావు అండదండలతో చిన్న వేశాలతో సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు అగ్ర కథానాయకుడిగా, నిర్మాతగా ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే అది ఎంతటిదైనా చేసేయాల్సిందే. కాదు కూడదు అనేది ఆ తర్వాత మోహన్ బాబు నోటి నుంచి వచ్చేది కాదు. అది ఇప్పటికీ మారలేదు. హీరోగా మాత్రమే నటించాలని ఏనాడు అనుకోలేదు మోహన్ బాబు.

మనసుకు నచ్చిన పాత్ర ఏది ఇచ్చినా చేయడానికి సిద్దంగా ఉండేవారు. అది విలన్ పాత్రైనా, కామెడీ పాత్రైనా, కౄరంగా ఉండే పాత్రైనా సరే సై అనేవారు. అందులో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించేవారు. ఇక ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాల పరంగా మోహన్ బాబు తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆయననని ఆర్ధికంగా దెబ్బ తీసిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే అందరూ ఇక అడ్రస్ లేకుండా పోతాడనుకుంటే అందరి అంచనాలను తారుమారు చేసి భారీ విజయాలను అందుకున్న సందర్భాలు, సినిమాలు ఉన్నాయి.

అలాంటి సినిమాలలో ఆయన నిర్మాణంలో వచ్చిన ‘అల్లుడుగారు’ సినిమా ఒకటి. ఒక సినిమాలో హీరో పాత్ర కోసం కేటాయించే డేట్స్తో గ్యారెంటీగా అయిదారు సినిమాల్లో విలన్గా చేేసి సినిమాల సంఖ్య పెంచుకోవచ్చు.. డబ్బూ సంపాదించుకోవచ్చు. అయినా కూడా ఆయన సొంత బ్యానర్పై తీసే సినిమాల్లో మాత్రమే హీరోగా నటిస్తూ, బయట సినిమాల్లో విలన్గా నటించాలని మోహన్బాబు తీసుకున్న నిర్ణయం మరొకరైతే తీసుకునేవారు కాదు. దీని వల్ల నష్టపోతావని అందరూ సలహాలిచ్చినా అది మోహన్
బాబుకు మాత్రం మంచే చేసింది.

మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా ఎంతటి ఘన విజాయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ముందు ఆయన నిర్మాణంలో వచ్చిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. అంతేకాదు బయట నిర్మాణ సంస్థలలో నిర్మించిన సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో మోహన్ బాబు ఇక సినిమాలు మానేస్తే మంచిదేమో అని మాట్లాడుకున్నారు. అలాగే ‘అల్లుడుగారు’ అనే సినిమా సొంత నిర్మాణ సంస్థలో మొదలు పెట్టినప్పుడు ఇక ఈయన మద్రాసు వదిలేసి ఊరెళ్ళిపోవడమే మిగులుతుందని అనుకున్నారు.

కానీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అత్యద్భుతంగా తెరకెక్కించిన ‘అల్లుడు గారు’ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మోహన్ బాబు నిర్మాతగా భారీ సక్సెస్ అందుకోవడానికి కారణం అయింది. అంతేకాదు అల్లుడు గారు మంచి కమర్షియల్ సక్సెస్ అందుకొని మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థకి మంచి లాభాలను తీసుకువచ్చి ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలను నిర్మించడానికి అవకాశం లభించింది. అల్లుడు గారు తర్వాత ఈ నిర్మాణ సంస్థ ద్వారా మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, మేజర్ చంద్ర కాంత్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.































