కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం దక్షిణాది సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయన లేరన్న మరణవార్త నుంచి ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు అభిమానులు బయటపడలేక పోతున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరూ నటుడు పునీత్ తో తనకున్న అనుబంధాన్ని బయట పెడుతూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఇకపోతే శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకి తరలించారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడి ఆఖరి చూపు కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటూ తమ అభిమాన నటుడికి ఘన నివాళి అర్పించారు. ఇలా అభిమానుల రాకతో కంఠీరవ స్టేడియం కిక్కిరిసిపోయింది.
పునీత్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కంఠీరవ స్టేడియానికి చేరుకొని అతని మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ రోజు మొత్తం పునీత్ పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. పునీత్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పునీత్ పెద్ద కుమార్తె జర్మనీలో ఉండడం చేత ఆమె వచ్చే వరకు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏదిఏమైనప్పటికీ సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందనీ చిత్రపరిశ్రమ ఎంతో విచారం వ్యక్తం చేస్తోంది. పునీత్ మరణించడంతో కర్ణాటకలోని సినిమా థియేటర్లను రెండు రోజుల పాటు మూసి వేస్తూ సంతాపం ప్రకటించారు. ఇక ఇప్పటికే పునీత్ భౌతికకాయాన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈయన అంత్యక్రియలలో పాల్గొనడానికి ఎన్టీఆర్, మెగాస్టార్ కూడా బెంగళూరు రానున్నట్లు సమాచారం.

































