కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేసినా కొందరు మాత్రం నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. నిత్యం జరుగున్న బైక్ యాక్సిడెంట్లలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా వాహనదారుల్లో మార్పు రాకపోవడంతో కోల్కతా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ వెళ్లే వాళ్లు పెట్రోల్ ను కొనుగోలు చేయలేరు. మరో రెండు రోజుల్లో కోల్ కతా అంతటా ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కోల్ కతా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలోని పెట్రోల్ బంకులకు హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించే వారికి పెట్రోల్ పోయకూడదని ఆదేశాలు జారీ చేశామని.. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని తెలిపారు.
టూ వీలర్ వాహనాలపై ప్రయాణించే వాళ్లలో బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక ఉండే వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అనూజ్ శర్మ వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం హెల్మెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టూ వీలర్లపై ప్రయాణించే వాళ్లు హెల్మెట్ ధరించాలని సూచనలు చేశారు.
ఎవరికైనా హెల్మెట్ కొనుగోలు చేసేంత స్థోమత లేకపోతే వారికి ప్రభుత్వమే ఉచితంగా హెల్మెట్ ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. సమీప పోలీస్ స్టేషన్ లో వివరాలు ఇచ్చి హెల్మెట్ ను పొందవచ్చని మమతా బెనర్జీ వెల్లడించారు. మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించమని.. అయితే మాస్క్ ధరించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నానని మమతా బెనర్జీ అన్నారు.































