చెన్నై/శ్రీకాళహస్తి: డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు సంచలన విషయాలను వెల్లడించారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు తమ సమస్య గురించి ముందే తెలుసని, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదని వారు ఆరోపించారు. శ్రీనివాస్ వద్ద తమ వ్యక్తిగత వీడియోలు ఉన్నందునే ఈ హత్య జరిగిందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

వినూత దంపతుల ఆరోపణలు ఇలా ఉన్నాయి:
“టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్ రూంలో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విక్రయించాడు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే మేము శ్రీనివాస్ను పని నుంచి తొలగించాము.” అని వినూత దంపతులు పోలీసులకు వివరించారు.
పవన్ కల్యాణ్కు ముందే సమాచారం ఇచ్చినా..
“ఆ విషయాన్ని వెంటనే అప్పటి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు చెప్పాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ గారు వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య వరకు వచ్చేది కాదు” అని చెన్నై పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు స్పష్టం చేశారు.
డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో ఈ కొత్త ఆరోపణలు కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



























