కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉంది.. మరోవైపు లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జోన్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల దగ్గర రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.

రాష్ట్రంలో మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు రాష్ట్రంలో తెరవనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. వైన్ షాపులకు వచ్చే వారు తప్పని సరిగా సామజిక దూరం పాటించాలని, మాస్క్ లను ధరించాలని సూచించారు.
































