దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మానవత్వాన్ని చంపేస్తోంది. తోటివారికి సహాయపడాలనే గుణాన్ని మనుషుల నుంచి దూరం చేస్తోంది. సొంత బంధువులైనా, స్నేహితులైనా కరోనా సోకిందంటే వారిని దూరం పెడుతున్నారు. కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందితే వారి దహన సంస్కారాలకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు చనిపోయిన వారిలో వైరస్ ఉండదని చెబుతున్నా ప్రజల ఆలోచనా తీరులో మార్పు రావడం లేదు.

తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై తరలించి అంత్యక్రియలు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో పూణెలోని ఖానాపూర్కు చెందిన యువకుడికి కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధారణ అయింది. కొన్ని రోజులు హోం క్వారంటైన్ లో ఉన్న యువకుడికి శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి.

సమస్య తీవ్రం కావడంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడు వెళ్లిన ఆస్పత్రిలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రిలో సరిగ్గా సౌకర్యాలు లేవనే కారణంతో యువకుడు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి వెళ్లిపోయాడు. అయితే యువకుడికి క్రమంగా ఆరోగ్యం క్షీణించి శుక్రవారం రోజున మృతి చెందాడు. ఇంట్లో మృతి చెందడం… బాధితుడి కుటుంబ సభ్యులు పేదవాళ్లు కావడంతో మృతదేహాన్ని ఎలా తరలించాలో వాళ్లకు అర్థం కాలేదు.
దీంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆంబులెన్స్ కావాలని ఫోన్ చేశారు. కానీ ఆంబులెన్స్ సిబ్బంది నుంచి సరైన స్పందన వ్యక్తం కాలేదు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు తోపుడు బండి సహకారంతో మృతదేహాన్ని తరలించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తోపుడు బండిపై మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని వాళ్లు పేర్కొన్నారు.
































