గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరుగనుంది. ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలకు, ప్రధాన కార్యదర్శులకు జలశక్తి శాఖ ఇప్పటికే సమాచారం పంపింది.

ఏపీ ప్రభుత్వం ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టును ప్రధాన అజెండాగా ప్రతిపాదించింది. కాగా, తెలంగాణ మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టును చర్చలో పెట్టకూడదని స్పష్టం చేసింది. పైగా బనకచర్లకు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేవని, ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తూ అభివృద్ధి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చ జరగడం అనుచితమని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేయవద్దని కేంద్రాన్ని కోరింది.
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం స్వయంగా చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని ప్రతిపాదించింది.
రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కొత్త ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఏర్పడే ఎపెక్స్ కౌన్సిల్నే అసలు వేదికగా పేర్కొంది. గత పదేళ్లలో ఈ కౌన్సిల్ కేవలం రెండు సార్లే సమావేశమైంది. కాగా, తాజా భేటీలో భిన్న అభిప్రాయాల నేపథ్యంలో, కేంద్రం దశలవారీ చర్చలకు మార్గం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇద్దరు సీఎంల హాజరుతో జరగబోయే ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జలవివాదానికి ఒక కీలక మలుపు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



























