కోతుల గుంపు ఒక్కసారిగా మనుషులకు కనిపించాయంటే అటు వైపు వెళ్లడానికి చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కోతులకు తినడానికి ఏమైనా దొరికిందంటే.. ఎగిరి గంతేస్తుంది. అంతే కాదు చిలిపి చేష్టలు కూడా చేస్తుంది. కోతికి ఆ పేరు కూడా ఉందన్న విషయం తెలిసిందే. సాధారణంగా కోతుల ఐక్యమత్యంగా ఉంటాయట. వాటిలో దేనికైనా ఏమైనా అయిందంటే.. ఒక్కసారిగా మీద పడతాయి.

అంతేకాదు తోటి కోతి చనిపోయిందంటే.. దాని దేహం వద్దకు వచ్చి మరీ బాధపడుతుంటాయి. మిగతా జంతువులకు కోతులకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే.. మనిషి ఆకృతి రావడానికి మూలం కోతి అని మన పూర్వికులు చెబుతుంటారు. ఇదంతా ఇలా ఉంటే.. ఒక కోతి ఓ వ్యక్తి పాలిట శాపంగా మారింది. అసలేమైందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగెహారా గ్రామంలో ఒక పాఠశాల వద్ద ఓ కోతి అక్కడ ఉన్న విద్యార్థులను.. స్థానికంగా ఉండే వారిని కూడా తెగ ఇబ్బంది పెట్టేసిందట.
దాని దాటికి తట్టుకోలేక అక్కడే ఉన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. దానిని పట్టుకునేందుకు కొంత మందిని పంపారు అధికారులు. అక్కడ వారు కోతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక ఆటో డ్రైవర్ జగదీశ్ వాళ్లకు సహకరించాడు. దానిని గమనించి కోతి అతడిపై దాడికి యత్నిస్తుండగా.. తన ఆటోలోనే దాక్కున్నాడు.
అయినా ఆ కోతి అతడిని వదిలి పెట్టలేదు.. ఆటో పైకి ఎక్కి టాప్ ను మొత్తం చించేసింది. ఎట్టకేలకు దానిని పట్టుకొని.. 22 కిలోమీటర్ల దూరంలో వదిలి పెట్టి వచ్చారు. మళ్లీ ఆ కోతి ఓ లారీ ఎక్కి అదే గ్రామానికి వచ్చి జగదీశ్ పై పగబట్టి అతడిపై దాడి చేసింది. దీంతో అతడు 8 రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. చివరకు మళ్లీ అధికారులు ఆకోతిని పట్టుకొని బంధించారు. అప్పుడు జగదీశ్ బతుకు జీవుడా అనుకుంటూ ఆటో నడపుకుంటున్నాడు.































