కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో రైళ్లను నడపడం శ్రేయస్కరం కాదని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. అంతేకాకుండా రాష్ట్రాల అప్పులను రీషెడ్యుల్ చేయాలనీ, ఎఫ్ ఆర్బీఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆయా రాష్ట్రాలు అనుమతించాలని కేసీఆర్ సూచించారు. మే 17 తో ముగియనున్న లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా మూడు అంశాలను ప్రధానికి వివరించారు.

కాగా, జులై, ఆగస్టు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే రైళ్లను పునరుద్దరించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. దేశంలో చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా భాదితులున్నారు. అందువల్ల ఇప్పుడు రైళ్లు నడిపితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజల రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు వెళ్తున్నారో, అందులో ఎవరికీ కరోనా ఉందొ తెలియదు. ఈ నేపథ్యంలో అందరికి టెస్టులు చేయడం కూడా కుదరదు. అందువల్ల ఇప్పుడు ప్రయాణికుల రైళ్లను నడపవద్దని కేసీఆర్ కోరారు.



























