కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం చేసే చిన్నచిన్న పొరపాట్లే చనిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ లో ఒక యువతి ఎలుకను చంపడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని చంపడం కోసం యువతి రెండు టమాటా పండ్ల ముక్కల్లో ఎలుకల మందు కలిపింది. అయితే ఎలుకల మందు కలిపిన విషయాన్ని మరిచిపోయిన యువతి చివరకు తనే చనిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ దీపారాపారా గ్రామంలో పాయల్ సాహు అనే యువతి తన కుటుంబంతో కలిసి నివశించేది. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ కావడంతో టమాటాలను ముక్కలుగా చేసి పాయల్ వాటిలో ఎలుకల మందు పెట్టింది. అయితే రోజంతా వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్న పాయల్ అనుకోకుండా ఆ టమాటా ముక్కలను తినింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే యువతి మృతి చెందింది.
యువతి కుటుంబ సభ్యులు విషం కలిపిన టమాటాలతో చేసిన సలాడ్ వల్లే యువతికి ప్రాణాపాయం ఏర్పడిందని.. వాంతులు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెబుతున్నారు. అయితే యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా పోలీసులు అనుమానాప్సద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దర్యాప్తు తరువాత మాత్రమే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. యువతి మృతి విషయంలో కుటుంబ సభ్యులు కొంత సమాచారాన్ని దాస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



























