కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను అటు సినీ పరిశ్రమతోపాటు ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఉదయం పునీత్ గుండెపోటుతో ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. తమ అభిమాన హీరోను కడసారి చూసుకునేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి, అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంకు తరలించి, అప్పటి నుంచి అభిమానుల సందర్శనార్థం ఇంకా అక్కడే ఉంచారు.
సెలెబ్రిటీలు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. నేడు సాయంత్రమే పునీత్ అంత్యక్రియలు జరుగుతాయని అనుకున్నారు. కాని తాజాగా అంత్యక్రియల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఈ విషయాన్నీ కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా ప్రకటించారు.
ఆయన కూతురు అమెరికా నుంచి వచ్చాకే అంత్యక్రియలు జరుగుతాయని, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పునీత్ కూతురు బెంగుళూరుకు చేరుకుంటుందని అనుకున్నారు. కానీ ఆమె ఇంకా బెంగుళూరుకు చేరుకోకపోవడంతో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేశారు. ఇక పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ రేపు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

































