దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతారవరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వ్యాపించడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే మే 7 వ తారీఖునుంచి ఈ అల్పపీడనం వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని ప్రకటించింది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని తెలిపింది.


































