ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఆన్లైన్ పద్ధతి ద్వారా తరగతులను బోధిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా క్లాసులు జరుగుతున్నప్పటికీ ఎంతోమంది చదువుకు దూరం అయ్యారు. కరోనా ప్రభావం వల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలోనే తమ పిల్లలకు ఫీజులు చెల్లించి చదివించడం భారం అవుతున్న నేపథ్యంలో చాలా మంది పిల్లలు చదువులు మానేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే మహారాష్ట్రకు చెందిన ఒక స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల చదువు కోసం గత ఏడాది నుంచి విరాళాలను సేకరిస్తున్నారు.ముంబైలోని పోవై ఇంగ్లీష్ హైస్కూల్ ప్రిన్సిపాల్ షిర్లే పిళ్లై ఇప్పటి వరకు రూ.40 లక్షలు సేకరించగలిగారు. దీని ద్వారా 200 మంది పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించారు.కరోనా ప్రభావం వల్ల తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల లో 50 శాతం మంది ఫీజులు చెల్లించలేక చదువుకు దూరమవుతున్నట్లు గ్రహించిన ప్రిన్సిపల్ ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తన స్కూల్ ఫీజులను సగానికి తగ్గించారు.
ఈ విధంగా సగం ఫీజు కూడా చెల్లించలేని విద్యార్థుల కోసం ఆమె విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు.ఎన్నో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ను సంప్రదించి విరాళాలు సేకరిస్తున్న ప్రిన్సిపల్ ఈ ఏడాది సుమారు 200 మంది పిల్లల ట్యూషన్ ఫీజులు చెల్లించింది. వచ్చే ఏడాదికి కూడా ఈమె విరాళాలను సేకరిస్తున్నారు.
ఈ కరోనా ప్రభావంతో ఎంతో మంది బాలికలు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని గ్రహించిన ప్రిన్సిపల్షిర్లే ఈ పరిస్థితి ఎవరికీ రాకుండా ముందుగానే విరాళాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర మొత్తం కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈమె నిధుల సేకరణ ఆపడం లేదు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది మరింత ఎక్కువ నిధులను సేకరించి మరి కొంతమంది పిల్లల చదువులు ఆగకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు.






























