సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అందుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్లకు అందం, రంగు, రూపం ఆధారంగా తీర్పులు ఇచ్చే పరిస్థితులు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి. అయితే అలాంటి విమర్శలను తట్టుకుని, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరోయిన్.. కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు కుటుంబానికి చెందిన ఐశ్వర్య రాజేష్ మొదట చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాత తమిళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. గ్లామర్ కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. సహజ నటన, ఎమోషనల్ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవల తెలుగులోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య.. కెరీర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది. అప్పట్లో హీరోయిన్ అంటే తెల్లగా, సన్నగా, బొమ్మలా ఉండాలనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉండేదని చెప్పింది. తన రంగు, రూపం గురించి కొందరు తక్కువ చేసి మాట్లాడేవారని తెలిపింది. “నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు.. కనీసం ఫ్రెండ్ పాత్రలకు కూడా సరిపోవు” అని కామెంట్లు చేశారని వెల్లడించింది.
అయితే ఆ మాటలే తనలో పట్టుదలను పెంచాయని ఐశ్వర్య తెలిపింది. అవకాశాల కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొని, వచ్చిన ప్రతి పాత్రను నమ్మకంతో చేశానని చెప్పింది. ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. తన ప్రయాణం ద్వారా ప్రతిభ ఉంటే ఎలాంటి విమర్శలనైనా అధిగమించవచ్చని మరోసారి నిరూపించింది ఐశ్వర్య రాజేష్.































