కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించి దాదాపు రెండు వారాలు అవుతున్నా పునీత్ సమాధిని చూడటానికి రోజూ వేలల్లో సందర్శకులు వస్తున్నారు.

ఇటీవల ఆ సమాధి వద్ద ఓ జంట పెళ్లి కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణ వార్త విని కొంతమంది అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పునీత్ కుటుంబసభ్యులు దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెబుతున్నా.. అభిమానులు ఆ విషయాలను పెడచెవిన పెడుతున్నారు. ఆత్మహత్యల పర్వం అక్కడ కొనసాగుతూనే ఉంది. దీంతో పునీత్ కుటుంబసభ్యులు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ పెద్దన్నయ్య రాఘవేంద్ర రాజ్కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా వచ్చారు.
పునీత్ మరణం తర్వాత ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించడానికి పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. పునీత్ అభిమానులు కొంతమంది అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నిర్వహించిన వారిలో టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళి అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు. అందులో ఓ అభిమాని గుండు కొట్టించుకొని పునీత్ కు నివాళులు అర్పించాడు.
































