Tarakaratna: నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు మొదటి రోజే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. 23 రోజులుగా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స పొందుతూ తాజాగా శనివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. 23 రోజులుగా ప్రాణాలతో పోరాడిన నందమూరి తారకరత్న ఇలా తుది శ్వాస విడవటంతో నందమూరి కుటుంబంతో పాటు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గత 23 రోజులుగా తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై వైద్యం తీసుకుంటున్నాడు. పాదయాత్రలో గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి అప్పటినుండి విషమంగానే ఉంది. గుండెపోటు రావటమే కాకుండా మెదడు పనితీరు లేకపోవడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. బెంగళూరుకి తరలించిన మొదటి రోజు నుండి శనివారం రాత్రి వరకు డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అహర్నిశలు కృషి చేశారు. అంతే కాకుండా విదేశాల నుండి డాక్టర్ బృందాన్ని కూడా రప్పించారు.
విదేశీ వైద్యుల రాకతో తారకరత్న పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని నందమూరి కుటుంబ సభ్యులలో ఆశలు మొదలయ్యాయి. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడి ఆయన ప్రాణాలతో బయటపడాలని నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా పూజలు, హోమాలు చేయించారు. అయితే శనివారం రోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కన్ను మూశాడని తెలియడంతో ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.

Tarakaratna: ఆ చిన్న తప్పే తారకరత్న ప్రాణాలను తీసిందా…
తారకరత్న ఎంతో ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి ఇలా తిరిగి రావడం ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. 23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు ప్రయత్నించినా కూడా తారకరత్నని బతికించలేకపోవడానికి మొదటి రోజు తప్పే కారణమా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తారకరత్నకు గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేయకుండా 45 నిమిషాల పాటు ఆలస్యం చేయటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే కనుక ఆయనకు సిపిఆర్ చేసి ఉంటే ప్రాణాలతో తిరిగి వచ్చేవారని భావిస్తున్నారు.































