Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపు పొందిన వారిలో ప్రముఖ దర్శకుడు తేజ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి దర్శకుడుగా గుర్తింపు పొందిన తేజ ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ హీరోగా రూపొందుతున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత తేజ తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ పాప్ కార్న్ రేటు థియేటర్లలో సినిమాని చంపేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కరోనా సమయంలో ఓటిటిలలో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు ఇప్పటికీ ఓటీటీ లో సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓటీటీల వల్ల థియేటర్లలో సినిమా చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాజాగా దర్శకుడు తేజ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. ఈ క్రమంలో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. “సినిమాలు రాకముందు ప్రజలు వీధి నాటకాలు చూసేవాళ్లు. ఆ తర్వాత సినిమా థియేటర్లు వచ్చాయి. అప్పుడు థియేటర్లలో సినిమాలు చూడటం ప్రారంభించారు. ఆ తర్వాత టీవి, యూట్యూబ్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయినా ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూడటం ఆపలేదు.ఎందుకంటే అక్కడ అయితేనే స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది.

Teja: టికెట్ రేట్ కన్నా పాప్ కార్న్ రేటు అధికం…
ఇక ప్రస్తుతం మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు అన్నీ చిన్నగా చేస్తున్నారు. అంతే కాకుండా మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్ రేటు టికెట్ కన్నా ఎక్కువగా ఉంది. పాప్ కార్న్, కోక్ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. నిజానకి టీవి, యూట్యూబ్, ఓటీటీలు సినిమాని చంపలేవు. కానీ, పాప్ కార్న్ రేటు మాత్రం థియేటర్లలో సినిమాని చంపగలదు. ముంబయిలో సినిమా చచ్చిపోయింది అంటే దానికి ఇదే కారణం. మల్టీప్లెక్సులకు వెళ్లి సినిమా చూడటం కన్నా సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూడటం చాలా ఉత్తమం. సినిమాలను ఏదీ చంపలేదు. ఒక్క పాప్ కార్న్ రేటు మాత్రం చంపగలదు” అంటూ డైరెక్టర్ తేజ వ్యాఖ్యానించారు.
































