SSMB 29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యి ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు తన తదుపరి సినిమాను దర్శకుడు రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ వరల్డ్ సినిమా తర్వాత దర్శకత్వం వహించబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం మహేష్ బాబు అభిమానులు జక్కన్న అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలోనే మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, ప్రపంచదేశాలు చుట్టే సాహస యాత్రలా ఉంటుందని ఒక సందర్భంలో రాజమౌళి చెప్పారు.
మ్యూజిక్ సిటింగ్స్ పనులు మొదలయ్యాయి..
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కథ పూర్తయింది అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కీరవాణి అదే పనిలో ఉన్నాడని, దానిపై వర్క్ జరుగుతుందని తెలిపారు. మ్యూజిక్ వర్క్స్ మొదలైంది అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలైపోయినట్టే అని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇటీవల జర్మనీకి వెళ్లడంతో ఈ సినిమా వర్క్ కోసమే జర్మనీ వెళ్లాడని రూమర్స్ కూడా వచ్చాయి.
ఈ సినిమాని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెడతారా అని మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కూడా మహేష్ బాబు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి మరి.



























