Vijayendra Prasad:టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలకు కథలను అందించడమే కాకుండా బాలీవుడ్ సినిమాకి కూడా కథా రచయితగా పనిచేశారు. ఇలా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పదవి దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా గోవాలో జరుగుతున్నటువంటి 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ రైటింగ్ విభాగానికి చెందిన విషయాల గురించి క్లాసెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

మనం మన చుట్టూ జరుగుతున్న విషయాల నుంచి ఏదైనా ఒక కొత్తదనాన్ని వెలికి తీసి వాటిని ఆవిష్కరించడమే రచయిత ముఖ్య లక్షణం అంటూ ఈయన వెల్లడించారు.ఒక రచయిత కథ సిద్ధం చేస్తే అది దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరించే లాగా ఉండాలి.ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామని ఒక అబద్ధాన్ని అందంగా తయారు చేసి చూపించడమే రచయిత లక్షణం అంటూ తెలిపారు.
అబద్ధాలు చెప్పే వారే స్టోరీ రైటర్స్…
మన చుట్టూ మన నిజజీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి. నేను వీటి ఆధారంగా కథను దొంగలిస్తాను అంటూ ఈయన షాకింగ్ విషయాలు బయట పెట్టారు. మన చుట్టూ రామాయణం మహాభారతం వంటి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. వాటి నుంచి కథలు తీసుకొని వాటిని అందరూ ఇష్టపడే విధంగా మలుచుకుంటానని తెలిపారు.ఇక అబద్ధాలు ఎక్కువగా చెప్పే వారే మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


























