భారతీయుల ఆహారంలో రొట్టెలకు ప్రత్యేక స్థానం ఉంది. గోధుమ, జొన్న, రాగి, బార్లీ వంటి ధాన్యాలతో తయారయ్యే రొట్టెలు పోషక విలువలతో పాటు తృప్తిని కూడా ఇస్తాయి. అయితే వేసవికాలంలో శరీరానికి తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకే ఏ రొట్టె త్వరగా జీర్ణమవుతుందో, ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

గోధుమ రొట్టె మన దేశంలో ఎక్కువగా వినియోగంలో ఉంటుంది. ఇది ఇతర రొట్టెలతో పోలిస్తే తేలికగా జీర్ణమవుతుంది. సాధారణంగా 2.5 నుంచి 3 గంటల్లో అరిగిపోతుంది. అయితే ఇందులో గ్లూటెన్ ఉండటంతో కొంతమందికి జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. గ్లూటెన్కు అలర్జీ ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం మంచిది.
మల్టీగ్రేన్ రొట్టెలు అనేవి జొన్న, సజ్జ, గోధుమ వంటి పలు ధాన్యాల మిశ్రమంతో తయారవుతాయి. ఇవి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. సాధారణంగా 3 నుంచి 4 గంటలు పట్టవచ్చు. అయితే దీర్ఘకాల ఆరోగ్యానికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
మొక్కజొన్న లేదా జొన్న రొట్టెలు గ్లూటెన్ లేనివి. ఇవి శరీరానికి మంచి పోషకాలు అందించినప్పటికీ కొద్దిగా బరువైన ఆహారంగా పరిగణిస్తారు. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి ఇవి అరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే బరువు నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయి.
రాగి రొట్టెలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కాల్షియం, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండటంతో ఎముకలకు బలం ఇస్తాయి. అలాగే నెమ్మదిగా జీర్ణమవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి రాగి మంచి ఎంపికగా భావిస్తారు.
మొత్తం చూస్తే త్వరగా జీర్ణమయ్యే రొట్టె గోధుమదే. కానీ ఆరోగ్యపరంగా చూస్తే ప్రతి ధాన్యానికి తనదైన ప్రయోజనం ఉంది. వ్యక్తిగత ఆరోగ్యం, జీర్ణశక్తి, జీవనశైలిని బట్టి సరైన రొట్టెను ఎంచుకోవడం ఉత్తమం. వేసవిలో తేలికగా అరిగే ఆహారం తీసుకుంటే శరీరం చల్లగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.




























