ఈ ప్రపంచం పై కరోనా మహమ్మారి నుంచి ఎంతోమందిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విధమైనటువంటి కష్ట కాలాలలో అప్పు ఇచ్చిన వారు తీసుకున్న వారి పై అధిక ఒత్తిడి కలిగించి వారి అప్పులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అప్పులు తిరిగి చెల్లించుకోలేక వారికి మరో దారిలేక ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. ఈ విధంగా అప్పుల బాధలు తట్టుకోలేక ఓ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు…

ఉంగుటూరు మండలం పొట్టిపాడుకి చెందిన రఘుబాబు పోస్టు మాస్టర్గా పనిచేసేవాడు. కుటుంబ అవసరాల కోసం తన ఊరిలో ఉన్న కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రఘు బాబును తన పదవి నుంచి సస్పెండ్ చేశారు. దీంతో అతనికి ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. దీనికితోడు ఇది వరకు తనకు అప్పులు ఇచ్చిన వారు ఒకసారిగా అతనిపై అధిక ఒత్తిడి కలిగించి తనకు ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.అయితే ప్రస్తుతం తాను అప్పు తిరిగి చెల్లించలేని తనకు అప్పు తిరిగి ఇవ్వడానికి కొంత గడువు కావాలని కోరారు.
ఈ విధంగా రఘుబాబు దంపతులు వడ్డీ వ్యాపారులను అప్పు చెల్లించడానికి కొంత సమయం అడిగినప్పటికీ వారు గడువు ఇవ్వకపోవడంతో ఎంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే వారికి ఏం చేయాలో దిక్కు తెలియక డబ్బులు ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కాక రఘు బాబు తన భార్య రాణితో కలసి పెద్దఅవుటపల్లిలోని జోసెఫ్ తంబి దేవాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. రఘుబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆయన భార్య రాణి నేడు ఉదయం ప్రాణాలను కోల్పోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.