Fake Fertilizers: భారత దేశంలో వ్యవసాయం అంటేనే రుతుపవనాలతో జూదం. ఏ ఏడాది పంట చేతికి వస్తే మరో ఏడాది తీవ్ర వర్షాల వల్లనో, కరువు వల్లనో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయినా ఏ నాడు వ్యవసాయాన్ని వదలడం లేదు రైతన్నలు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా ఎరువులకు, కౌలుకు, కూలీలకు రేట్లు పెరుగుతున్నాయి.

మొత్తంగా పెట్టుబడీ పెరుగుతున్నా.. అందుకు తగిన గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా రాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారుల మాటలు నమ్మి నట్టేటా మునిగిపోతున్నారు.

ముఖ్యంగా సీజన్ ప్రారంభం అయిందంటే నకిలీ విత్తనాలు.. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తానాలు నకిలీవి అమ్ముతున్నారు. పంట వేసిన కొంత కాలానికి కాపు, పూత రాక నష్టపోతున్నారు. పురుగుల మందు తాగుతూ.. ఉరి వేసుకుంటు రైతులు తనువు చాలిస్తున్నారు.
గోదాంలతో స్టాక్ పెట్టి పలు గ్రామాల్లో..
సరిగ్గా ఇలాంటి కల్తీ వ్యవహారమే రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో తిరుగుతూ రైతులకు నకిలీ ఎరువులు అంటగట్టారు. తడమడ్ల గ్రామంలో రైతు స్వామికి ఇలాంటి నకిలీ ఎరువులను అంటగట్టారు. బస్తాకు రూ. 1000 నుంచి రూ. 2000 లకు ఎరువులను అంటగట్టి… ఎక్కువ దిగుబడి వస్తుందంటూ.. మాయమాటలు చెప్పారు. దోమకొండ మండలం కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని గోదాంలతో స్టాక్ పెట్టి పలు గ్రామాల్లో విక్రయించారు. అయితే పంటలో వేస్తే ఎటువంటి మార్పు రాలేదని.. కేవలం మట్టి మాత్రమే బస్తాల్లో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తాము మోసపోయామని.. ఇప్పటికైనా అధికారులు కల్తీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




























