బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న నటి, యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ శ్రీముఖి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పటాస్ షో ద్వారా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకొని బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ గా నిలిచిన శ్రీముఖి ఇంకా సినిమా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అప్పటికే వెండితెరపై కూడా చిన్ని చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది శ్రీముఖి.

జులాయి చిత్రంలో ఆమె మొదటి సారిగా సినిమాలో నటించారు. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది. ఓవైపు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే మరోవైపు యాంకర్గా రాణించింది. సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్స్, ఆడియో వేదికల్లో సందడి చేస్తూ దూసుకుపోతోందీ శ్రీముఖి. అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించిన “క్రేజీ అంకుల్స్” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.
దీంతో ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది శ్రీముఖి. కెరీర్ లో ఎన్నో కష్టాలు పడ్డానని.. యాంకరింగ్ మొదలు పెట్టిన సమయంలో చాలా ఇబ్బందులకు గురైనట్లు చెప్పింది. షూటింగ్ చేసే సమయంలో చాలాసేపు నిలబడి ఉండాల్సి వచ్చేదని తెలిపింది. అలా నిలబడి.. నిలబడి కాళ్లు తిమ్మిరి పట్టేవని ఆమె చెప్పుకొచ్చింది.
కొన్ని సందర్బాల్లో ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే.. మళ్లీ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఇంటికి చేరుకున్నానని చెప్పింది. ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అంటూ ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఆమె వాపోయింది. అయితే తన తండ్రి ఇచ్చిన ధైర్యంతోనే వాటిని అధిగమించినట్లు చెప్పుకొచ్చారు శ్రీముఖి. ఆ కష్టాలను అధిగమించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చిందీ ఈ అమ్మడు. ఇక విడుదలకు సిద్ధమవుతున్న క్రేజీ అంకుల్స్ సినిమా శ్రీముఖి కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.































