ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై మరోసారి ఉద్రేకం నెలకొంది. రాజకీయ నేతల తీరు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలపై ప్రశ్నలు సంధిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.

శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఓ సభలో పాల్గొన్న శ్యామల, పవన్ కళ్యాణ్ పై స్పందిస్తూ “డిప్యూటీ సీఎం గారు ప్రజలకు అందుబాటులో లేరు, కనీసం కనిపించడంలేదు” అంటూ ఆరోపించారు. ఆమె చేతిలో ఉన్న ప్లకార్డ్పై “పవన్ కల్యాణ్ ఎక్కడ?” అన్న ప్రశ్న వున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ హయాంలో పిఠాపురం ఎమ్మెల్యేగా తానేనన్నట్టు పోరాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక అసలు ప్రజల్లోకి రావడం లేదని ఆమె మండిపడ్డారు. “అందుబాటులో లేని నేతకు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి?” అంటూ నిలదీశారు.
తదుపరి దాడి బాలకృష్ణపై. శ్యామల వ్యాఖ్యల ప్రకారం, “హిందూపురంలో అభివృద్ధి ఏమీ జరగలేదు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఒక డిగ్రీ కళాశాల లో క్లాసులు ప్రారంభించలేదు. పేరు మాత్రమే ఉంది” అని ఆమె ఎద్దేవా చేశారు. పోలింగ్ సమయంలో వైసీపీకి ఓ కేంద్రంలో కేవలం ఒక్క ఓటు రావడాన్ని ఉదాహరణగా చూపుతూ, “ఇది ప్రజల గెలుపా? లేక మాయా గెలుపా?” అని ప్రశ్నించారు. “బాలకృష్ణ ఒక్కోసారి మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తారు. ఎక్కువ సమయం సినిమా షూటింగ్లతోనే గడుపుతున్నారు” అని విమర్శించారు.
పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి ప్రముఖులపై చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజా నేతలు ప్రజల మధ్య ఉండాలి. ప్రజల గళంగా మారాలి అన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన శ్యామల వ్యాఖ్యలు, ఒక వైపు వైసీపీ స్టాండ్ను బలపరుస్తూ, మరోవైపు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి.
ఇక ఈ వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ ఎలా రియాక్ట్ అవుతారు అనే ఆసక్తికర అంశం. ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా శ్యామల చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి.


































