వేసవికాలం వచ్చిందంటే మార్కెట్లో మామిడి, పుచ్చకాయలతో పాటు లిచీ పండ్ల సందడి కూడా మొదలవుతుంది. తియ్యటి రుచి, జ్యూసీ టెక్స్చర్తో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది లిచీని ఇష్టంగా తింటారు. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీహైడ్రేషన్ను తగ్గించడంలో కూడా లిచీ సహాయపడుతుంది.

అయితే ఎంత మంచి పండైనా మితిమీరితే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లిచీని ఖాళీ కడుపుతో లేదా అధిక పరిమాణంలో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పండులో ఉండే కొన్ని సహజ రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపవచ్చని నిపుణుల అభిప్రాయం.
అధికంగా లిచీ తిన్నప్పుడు కొందరికి తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఖాళీ కడుపుతో ఎక్కువ లిచీలు తింటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా తగ్గే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు రావచ్చు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజుకు 8 నుంచి 10 లిచీ పండ్ల వరకు మాత్రమే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పండ్లు తినే ముందు వాటిని శుభ్రంగా కడగడం అవసరం. ఎందుకంటే తొక్కపై ఉండే దుమ్ము, రసాయన అవశేషాలు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఫ్రిజ్లో ఉంచిన లిచీని వెంటనే తినకుండా కొద్దిసేపు బయట ఉంచి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు, రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా తగ్గే సమస్య ఉన్నవారు, అలెర్జీలకు త్వరగా గురయ్యే వారు లిచీ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలకు కూడా పరిమిత మోతాదులో మాత్రమే ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
పోషకాలు పుష్కలంగా ఉన్న లిచీ ఆరోగ్యానికి మేలు చేసే పండే అయినప్పటికీ, సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. రుచిగా ఉందని అతిగా తినకుండా మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.




























