ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి చాలా మందికి రోజువారీ సమస్యగా మారింది. సాధారణంగా స్ట్రెస్ వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. అయితే తాజా అంతర్జాతీయ అధ్యయనం మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఒత్తిడి దంతాల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా రాత్రిపూట నిద్రలో పళ్లు బిగించి కొరకడం లేదా దవడను గట్టిగా పట్టుకోవడం వంటి అలవాట్లు స్ట్రెస్తో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ఉదయం లేవగానే పంటినొప్పి, దవడ నొప్పి లేదా తలనొప్పి అనిపిస్తే, అది రాత్రి నిద్రలో తెలియకుండానే పళ్లు కొరికిన సంకేతం కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిని వైద్య భాషలో “బ్రక్సిజం”గా పిలుస్తారు.
అధ్యయనాల ప్రకారం, జనాభాలో గణనీయమైన శాతం మంది రాత్రివేళల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా పళ్లు బిగించి కొరికే అలవాటు కలిగి ఉన్నారు. ఇది దీర్ఘకాలంలో దంతాలపై రాపిడిని పెంచి, పళ్లు బలహీనపడటానికి దారితీస్తుంది. కొందరిలో పళ్లు దెబ్బతినడం, దవడ కండరాల నొప్పి, దంతాల సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు.
దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు నిద్రపోయే ముందు మౌత్ గార్డ్ వాడటం వల్ల పళ్లను రక్షించుకోవచ్చు. అలాగే సమస్య తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
ఇక ఒత్తిడిని నియంత్రించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. రోజువారీ జీవితంలో కొద్దిపాటి మార్పులు చేస్తే స్ట్రెస్ను తగ్గించుకోవచ్చు. వ్యాయామం, యోగా, ధ్యానం, దీపంగా శ్వాస తీసుకోవడం వంటి అలవాట్లు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అదనంగా, ఇష్టమైన పనులు చేయడం, వినోదాత్మక కార్యక్రమాలు చూడడం వంటి చర్యలు కూడా ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
మొత్తంగా చూస్తే, ఒత్తిడి ప్రభావం మనం ఊహించిందే కంటే ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంతో పాటు దంతాలపై కూడా దాని ప్రభావం ఉంటుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. కాబట్టి స్ట్రెస్ను నియంత్రించడం, అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను ముందుగానే నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.



























