తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించాల్సిన బోనాల పండుగను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి కారణంగా పండుగను రాజకీయ రంగంలోకి లాగే ప్రయత్నాలు, అసాంఘిక శక్తులు గొడవలకు ప్రేరేపించబోతున్నాయన్న అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

ఆగమ శాస్త్రం ప్రకారం శాకాహార బోనాలే నిర్వహించాలని ఆలయ పాలకులు, వేద పండితులు సూచించినప్పటికీ, కొందరు శక్తులు మాంసాహార బోనాల నిర్వహణపై తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భక్తుల మధ్య తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉండటంతో, శాంతియుత వాతావరణం కోసం తాత్కాలికంగా పండుగను వాయిదా వేసినట్లు వెల్లడించారు. ప్రజల మనోభావాలను గౌరవించడమే ఈ నిర్ణయానికి ప్రథమ ప్రాధాన్యం అని ఆమె స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై కూడా మంత్రి సురేఖ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మంత్రి పదవి పోతుందన్న కోణంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. “కడియం కాంగ్రెస్లోనూ టీడీపీలో ఉన్నట్లే వ్యవహరించాలని చూస్తున్నాడు” అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వద్దకు వెళ్లి తనపై అవాస్తవాల్ని చెబుతున్నాడని ఆరోపించారు.
ఇప్పటికే వివాదాస్పదంగా మారిన భద్రకాళి బోనాల అంశం, రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం పండితులతో, ఆలయ కమిటీతో సంప్రదింపులు జరిపి త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.


































