దేశంలోని పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు, వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రాథమికంగా బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు, పక్షులు చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ భయం వల్ల చాలామంది గుడ్లు, చికెన్ అంటే టెన్షన్ పడుతున్నారు. గుడ్లు, చికెన్ తింటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇలాంటి సమయంలో గుడ్లు, చికెన్ తినవచ్చా..? తినకూడదా..? అనే సందేహం చాలామందిని వెంటాడుతోంది. గడిచిన వారం రోజుల నుంచి గుడ్లు, చికెన్ వినియోగం తగ్గడంతో వీటి ధరలు కూడా భారీగా తగ్గాయి. డబ్ల్యూహెచ్వో తాజాగా గుడ్లు, చికెన్ తినడం వల్ల ఎటువంటి నష్టం లేదని.. బాగా వేడి చేసిన గుడ్లు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉండదని.. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచించింది.
అయితే బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను దగ్గరకు తీసుకున్నా, ఉడికీ ఉడకని బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తిన్నా మనుషులు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. వైరస్ ప్రమాదం లేని రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన చెందకుండా గుడ్లు, చికెన్ తినవచ్చని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. కనీసం 70 డిగ్రీల దగ్గర గుడ్లు, చికెన్ ఉండించడం ద్వారా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరోవైపు నిపుణులు మాంసాన్ని శుభ్రంగా కడగడంతో పాటు చేతులను కూడా శుభ్రంగా కడగాలని సూచిస్తున్నారు. సగం ఉడికించిన మాంసం, హాఫ్ బాయిల్డ్ తినకూడదని చెబుతున్నారు. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ ఫౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాలకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది.































