సాధారణంగా వివాహం అంటే ఏ కళ్యాణమండపము లేదా ఏ గుడి వద్దనో అది లేకపోతే ఇంటి వద్దనో వారికున్న స్థోమతకు తగ్గట్టుగా జరుపుకుంటారు. కానీ మీరెప్పుడైనా వివాహం మద్యం షాపు దగ్గర జరుపుకోవడం చూశారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కేరళలోని కోజికోడ్లో ఓ జంట మాత్రం మద్యం షాపు ముందు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విధంగా వీరిరువురు మద్యం షాపు ముందు వివాహం చేసుకోవడానికి కారణం లేకపోలేదు. అసలు వీరు అక్కడ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కేరళలోని కోజికోడ్ కు చెందిన ప్రమోద్, ధన్యాలు కొంత కాలంగా క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి తెలపడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. పెళ్లికి పెద్దగా జనాలు రాకపోవడంతో వీరికి ఆర్డర్లు రావడం తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఈ విధంగా క్యాటరింగ్ నిర్వహించేవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అందుకే ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మద్యం షాపు ముందు వివాహం చేసుకున్నామని ఈ జంట తెలిపారు.
ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో మద్యం షాపుల ముందు పెద్దఎత్తున జనాలు ఉన్నారు.ఈ విధంగా మద్యం షాపుల ముందు పాటించని కరోనా నిబంధనలు వివాహ వేడుకలలో ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని క్యాటరర్స్ను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో పెళ్లిళ్లకు వందమందికి అనుమతివ్వాలని కోరారు.
ఈ విధంగా ఈ జంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మద్యం షాపు ముందు వివాహం చేసుకున్నటువంటి సంఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆలోచింపజేశాయి. ఈ పోస్టు చూసిన కొందరు వీరి ఐడియా బాగుంది… అని కామెంట్ చేయగా మరికొందరు తక్షణమే వీరికి సహాయం చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట మద్యం షాపు ముందు వివాహం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






























