సాధారణంగా మనం దేవాలయాలను దర్శించినప్పుడు ముందుగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం ఆలయం లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత తలపై శఠగోపం పెట్టడం మనం చూస్తుంటాం. అసలు ఈ శఠగోపం అంటే ఏమిటి? గుడిలో మనకు తల పై శఠగోపం ఎందుకు పెడతారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం ఆలయంలో ఉన్న దేవతలకు ప్రతీకగా భావిస్తారు.గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి గర్భగుడిలో ఉన్న దేవుడిని తాకే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం స్వామివారి పాదాల వద్ద ఉంచి దానిని తెచ్చి మన తలపై పెడతాడు. అంతేకాకుండా శఠగోపం పై స్వామి వారి పాదాలు ఉంటాయి.దీనిని తలపై పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల దగ్గర వెళ్ళి నమస్కరించినట్లు భావిస్తారు.
ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల చెంతకు వెళ్లి చెప్పినట్లు.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ శఠగోపం రాగి, వెండి, కంచు వంటి పదార్థాలతో వలయాకారంలో తయారుచేస్తారు.శఠగోపం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనకరం. లోహంతో తయారు చేసిన ఈ శఠగోపం తలపై ఉంచినప్పుడు మనలో విద్యుదావేశం జరిగి అధిక మొత్తంలో విద్యుత్ బయటకు వెళ్ళటం వల్ల మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

































