వ్యాపారం చేయాలంటే.. ఎవరికైనా డబ్బు అనేది అవసరం ఉంటుంది. కొంతమంది వారి దగ్గర ఉన్న డబ్బుతో వ్యాపారం ప్రారంభిస్తారు. మరికొంత మంది లోన్ తీసుకొని వ్యాపారం పెడతారు. అయితే ఇలా లోన్ తీసుకొని వ్యాపారాలు చేసే వారికి ఇది ఒక శుభవార్త లాంటింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియాలో కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. కొత్తగా లెండింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. చిరు వ్యాపారాలు చేసేవారికి రూ.50 లక్షల వరకు లోన్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది.

ఈ బిజినెస్ ను మొదట ఇండియాలోనే ప్రారంభించడం విశేషం. దాదాపు 150 నుంచి 200 పట్టణాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ఇండిఫై లెండింగ్ ప్లాట్ఫామ్తో ఒప్పందం కుదుర్చుకుంది ఫేస్బుక్. ఎలాంటి ష్యూరిటీ లేకుండా.. 17 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీ ఉంటుందని.. 5 రోజుల్లోని ఈ రుణాలను మంజూరు చేస్తామని ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ తెలిపారు.
మహిళలు ఈ రుణాలు తీసుకొంటే.. 0.2 శాతం వడ్డీ తక్కువగా ఉంటుందని తెలిపారు. భారత్ తో పాటు 30 దేశాల్లో ఈ వ్యాపారులకు మద్దతుగా ఉండేందుకు ఫేస్బుక్ ఈ చొరవ తీసుకుంది. న్యూఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు మరియు హైదరాబాద్ లో కరోనా కారణంగా నష్టపోయిన చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఫేస్ బుక్ ఆర్థిక సహకారాన్ని అందించింది.
ఇండిఫై లెండింగ్ ప్లాట్ఫామ్తో చేతులు కలిపిన ఫేస్ బుక్ వ్యాపారులకు రుణాలను మంజూరు చేయనుంది. ఎంత మందికి ఈ రుణాలను ఇవ్వనున్నారనేది పేర్కొనలేదు. ఫేస్బుక్కు చెందిన వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్స్ ను 20 కోట్ల మంది ప్యాపారులు ఉపయోగిస్తున్నారు. బిజినెస్ యూజర్స్ ఒక్క వాట్సాప్ లోనే 1.5 కోట్ల మంది ఉన్నారు. ఇలా ఇండియాకు చెందిన వ్యాపారులు కూడా ఈ యాప్స్ ల ద్వారా తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు.






























