ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. శ్రీవారి భక్తులు తిరుమలకు కాలం చెల్లిన వాహనాలలో వస్తే ఇబ్బందులు పడక తప్పదు. కాలం చెల్లిన వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమల, ఘాట్ రోడ్లపై కాలం చెల్లిన వాహనాలను అనుమతించబోమని తేల్చి చెప్పారు. 2010 కంటే ముందు రిజిష్టర్ అయిన వాహనాల విషయంలో ఈ నిబంధన అమలులోకి రానుంది.

పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తోంది. ఈ నిబంధనపై అవగాహన లేకపోతే మాత్రం భక్తులకు సమస్యలు తప్పవు. పోలీసులు పాత వాహనాలతో పాటు ఫిట్ నెస్ లేని వాహనాలపై కూడా దృష్టి పెట్టారు. ఫిట్ నెస్ లేని వాహనాలను తిరుమలలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పాటు కాలుష్యం పెరుగుతుందని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తిరుమల నో హారన్ జోన్ అని ఇక్కడ హారన్ మోగించకూడదని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉలంఘించించి శ్రీవారి భక్తులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమ నిబంధనల వల్ల తిరుమలలో వాహన ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. భక్తుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రెండో ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిపివేస్తూ ఉండటంతో అక్కడ వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మరోవైపు ఈ నెలలో తిరుమలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 14న దీపావళి ఆస్థానం, 18న నాగుల చవితి, 25న స్మార్త ఏకాదశి, 26న మధ్వ ఏకాదశి, 29న కార్తీక దీపం ఉత్సవాలు జరగనున్నాయి.






























