చమురు కంపెనీలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధరల పెంపు రూపంలో మరో పిడుగు పడింది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు గురించి సామాన్యుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దేశీయ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 594 రూపాయల నుంచి 644 రూపాయలకు పెరిగింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా సిలిండర్ ధరలను చమురు కంపెనీలు పెంచడం గమనార్హం.
ఇప్పటికే నూనెల నుంచి బియ్యం వరకు గత కొన్ని రోజులుగా అన్ని వస్తువుల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రైవేట్ కంపెనీలు వేతనాల్లో భారీగా కోత విధించాయి. ఇలాంటి సమయంలో గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.
ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో విధంగా ఉండటం వల్ల రాష్ట్రాన్ని బట్టి గ్యాస్ సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. హైదరబాద్ లో సిలిండర్ ధర రూ.646.50 ఉండగా తాజాగా పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర రూ.696.50కు చేరడం గమనార్హం.

































