దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. భారత్ లో కోట్ల సంఖ్యలో ప్రజలు ఇతరులకు నగదు పంపడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర అవసరాల కోసం గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. గూగుల్ కంపెనీ తాజాగా కస్టమర్లకు వరుస శుభవార్తలు చెప్పింది. వినియోగదారులకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. యాప్ ను రీబ్రాండ్ చేయడంతో పాటు కొత్త లోగోను తీసుకొచ్చింది.

అయితే గూగుల్ పే అందుబాటులోకి తెచ్చిన కొత్త సర్వీసులు ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ పే కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో కొత్త సర్వీసులను ఇతర దేశాల్లో సైతం అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ సంస్థ ప్రయత్నిస్తోంది. భారతదేశంలో సైతం త్వరలో గూగుల్ సంస్థ గూగుల్ పే కొత్త సర్వీసులను లాంఛ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గూగుల్ పే కస్టమర్లకు కొత్త సర్వీసుల్లో భాగాల్లో కస్టమర్లు బ్యాంక్ అకౌంట్ తెరిచే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ బ్యాంక్ సర్వీసుల ద్వారా కస్టమర్లు మనీ ట్రాన్స్ఫర్, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. లావాదేవీల వివరాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల వివరాలు, అనాలిటిక్స్ వివరాలను సైతం పొందే అవకాశం ఉంటుంది. గూగుల్ పేమెంట్స్కు చెందిన సీజర్ సేన్గుప్తా అన్ని ఆర్థిక వ్యవహారాలకు ఒకే యాప్ అనే విధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.
మన దేశంలో గూగుల్ పే యాప్ 11 బ్యాంకులతో జత కట్టింది. గూగుల్ పే యూజర్లకు కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే తమకు నచ్చిన బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తెరిచిన కస్టమర్లు ఉచితంగా ఏటీఎం సర్వీసులను పొందవచ్చు. కొత్తగా అందుబాటులో తెచ్చిన సర్వీసులను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.


























